హైదరాబాద్, జులై 12
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించనుంది. కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ను ఈ నెల 26న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభం నుంచే రైళ్ల రాకపోకలు మొదలవుతాయి.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే త్వరలో శుభవార్త అందించనుంది. కొమురవెల్లిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రైల్వే స్టేషన్ను ఈ నెల 26న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచే ఈ స్టేషన్లో రైళ్ల రాకపోకలు ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి కొమురవెల్లి మీదుగా సిద్దిపేటకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం పూట రెండు రైళ్లు నడుస్తాయని వారు పేర్కొన్నారు.
అదేవిధంగా, తిరుగు ప్రయాణంలో సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మరో రెండు రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు.
స్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖలోని మూడు విభాగాల అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణికుల అవసరాలపై దృష్టి సారించనుంది.
ప్రస్తుతం ఈ మార్గంలో సికింద్రాబాద్ - సిద్దిపేట ప్యాసింజర్, డెమో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. భవిష్యత్తులో ఈ లైన్ను కరీంనగర్, కాజీపేట మార్గాలకు అనుసంధానించడం ద్వారా మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపే అవకాశం ఉంది.
ఈ నూతన రైల్వే లైన్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్ జిల్లాల భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. రాజధాని నగరం సికింద్రాబాద్ నుంచి నేరుగా కనెక్టివిటీ ఉండటంతోపాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ప్రయాణం ఎంతో సులువు కానుంది. ముఖ్యంగా వీకెండ్స్, శ్రావణ మాసం, జాతరల సమయంలో ఈ జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేని సురక్షితమైన ప్రయాణ సదుపాయం లభించనుంది.












