హైదరాబాద్, 3 July
ఏజెన్సీ ప్రాంతాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం సచివాలయంలో సీఎంను కలిసి వినతిపత్రం అందించింది.
ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంత శాసనసభ్యులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని కోరారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కూడా కోరారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), వెడ్మ బొజ్జు (ఖానాపూర్) ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.












