నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా వివిధ రకాల పంటలు తీవ్రంగా నష్టపోయాయని, బాధితులైన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ చేశారు.
సోమవారం రాత్రి కురిసిన వర్షాలు, బలమైన గాలుల వల్ల జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గాల్లో మామిడి, నువ్వులు, ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న, వరి వంటి పంటలు నేలకొరిగి భారీ నష్టం వాటిల్లిందని జగన్ మోహన్ తెలిపారు. చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు.
ఈ నష్టంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి కనీసం రూ. 60,000 చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని, వారికి తగిన న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అకాల వర్షాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ సూచించారు. ప్రభుత్వ సహాయం అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.








