రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
మిర్యాలగూడలో పలు రైస్ మిల్లులను సందర్శించిన చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంలో క్వింటాకు రూ.2750 ధర లభించగా, ప్రస్తుతం మిల్లర్లు సిండికేట్ గా మారి క్వింటాకు రూ.2400 మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యాన్ని నియంత్రించడానికి సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
కొన్ని రకాల ధాన్యాలకు (కేఎన్ఎం, మహేంద్ర చింటు) క్వింటాకు రూ.2100 మాత్రమే ధర చెల్లిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ఏడాది యాసంగి బోనస్ ను వెంటనే విడుదల చేయాలని, ఐకేపీ కేంద్రాలను తెరిచి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ఆయన కోరారు. రైతుల సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.
పెట్టుబడి వ్యయం పెరిగిన నేపథ్యంలో, కనీసం క్వింటాకు రూ.3000 గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, సర్పంచులు, నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు.











