నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (31) స్వర్ణ బ్యాక్ వాటర్ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
గురువారం సాయంత్రం స్వర్ణ బ్యాక్ వాటర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు గత మూడు సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఇస్మాయిల్ చికిత్స కోసం క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదిస్తున్నప్పటికీ, అతని పరిస్థితిలో పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
అతని ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలో, గురువారం సాయంత్రం స్వర్ణ బ్యాక్ వాటర్ బ్రిడ్జ్ సమీపంలో నీటిలో శవమై కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇబ్రహీం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.


