గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బి.ఎం వినోద్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఈ పాలసీ రూపకల్పనకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ, గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటించి, వలస కార్మికులు, వారి కుటుంబాలతో సమావేశమైంది. ఈ సమావేశంలో, గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు అవసరమైన చట్టపరమైన, సామాజిక, ఆర్థిక సహాయంపై చర్చించారు. ఆయా దేశాల చట్టాలపై అవగాహన కల్పించడం, లైసెన్సు కలిగిన ఏజెన్సీల ద్వారానే వలసలు జరిగేలా చూడటం వంటి అంశాలపై దృష్టి సారించారు.
ప్రభుత్వం తరపున 'టామ్ కామ్' ద్వారా విదేశాలలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గ్రామీణ స్థాయిలో దీనిపై విస్తృత అవగాహన కల్పించడంపై కమిటీ సభ్యులు చర్చించారు. గల్ఫ్ దేశాలలో సమస్యల్లో చిక్కుకున్న కార్మికులకు సత్వర సహాయం అందించేందుకు అధికారులకు సూచనలు చేశారు.
జిల్లాలో గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడాన్ని కమిటీ అభినందించింది. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ, హెల్ప్ లైన్ ద్వారా అనేక మంది కార్మికులకు సహాయం అందిస్తున్నట్లు, అవసరమైన వారికి కలెక్టర్ చొరవతో స్వదేశానికి రప్పించినట్లు తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


