ఆర్మూర్ మండలం అంకాపూర్లోని వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో సోమవారం అధర్వవేద పారాయణ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. 12 రోజుల పాటు కొనసాగుతున్న ఈ యజ్ఞంలో పలు ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక వక్తలు శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి మాట్లాడుతూ, యజ్ఞం వేదమంత్రాలతో అగ్నిసాక్షిగా చేసే పవిత్ర కర్మ అని, దీని ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సుతో పాటు పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.
యజ్ఞం వల్ల పాపాలు నశించి, దేవతల అనుగ్రహంతో కోరికలు సిద్ధిస్తాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యజ్ఞ గుండం నుండి వెలువడే ధూమం వాతావరణాన్ని శుద్ధి చేసి, కాలుష్యాన్ని తగ్గిస్తుందని, నెయ్యి, మూలికల వాడకం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు.
యాగ బస్మాన్ని పంట పొలాల్లో చల్లడం వల్ల ఎరువుగా పనిచేసి, పంటలు సమృద్ధిగా పండుతాయని, యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరచి ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చని వక్తలు పేర్కొన్నారు.
ఈ మహాయజ్ఞంలో నిజామాబాద్, ఆర్మూర్, అంకాపూర్, సంగారెడ్డి ప్రాంతాల నుండి యజ్ఞ దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


