తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం కానున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశం కోసం ఆయన ఇప్పటికే అమిత్ షా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ ఐజీ సుమతి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల పలువురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహరెడ్డి వంటి మావోయిస్టు నాయకులు తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కమాండర్' సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు నేపాల్లో ఉన్నారని, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటులో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకంగా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో డీజీపీ, సుమతి, విజయ్ కుమార్ వంటి అధికారులను అమిత్ షా అభినందించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


