చిత్తూరు, నమస్తే
భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందనే తీవ్ర మానసిక ఒత్తిడితో, అమెరికాలో ఇంజినీర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా 109 సార్లు విమానాలకు, ప్రభుత్వ ఆస్తులకు బాంబు బెదిరింపులు పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సైబర్ నేరగాడిని తమిళనాడు ఉగ్రవాద నిరోధక విభాగం () పోలీసులు అరెస్ట్ చేశారు.
విమానాశ్రయాలు, పలు ప్రభుత్వ ఆస్తులకు బాంబు బెదిరింపులు పంపి కోట్లాది రూపాయల నష్టానికి కారణమైన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 109 సార్లు ఈ తరహా బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని విచారించగా, అతని నుంచి వెల్లడైన నిజాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతానికి చెందిన శరత్ సుబ్రమణ్యన్ శంకర్ వృత్తిరీత్యా అమెరికాలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. విదేశాల్లో మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు అతన్ని తీవ్ర మానసిక వైకల్యానికి గురిచేశాయి. భార్య తనను విడిచిపెట్టి వెళ్లడంతో తీవ్ర ఒత్తిడికి గురైన శరత్, వింత రీతిలో సైబర్ నేరాలకు పాల్పడటం మొదలుపెట్టాడు.
అమెరికాలో ఉంటూనే తమిళనాడుతో పాటు దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థలు, ప్రముఖ వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్ మరియు డీజీపీ ప్రధాన కార్యాలయాలకు బాంబులు పెట్టినట్లు ఇమెయిల్స్, మెసేజ్ల ద్వారా వరుస బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన తమిళనాడు ఉగ్రవాద నిరోధక విభాగం (ATS) పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.
జులై 22న శరత్ అమెరికా నుంచి చెన్నై విమానాశ్రయంలో దిగగానే ఏటీఎస్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం పుళల్ సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న శరత్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని సమగ్రంగా విచారించారు. "నా భార్య నన్ను విడిచిపెట్టి దూరమైంది. ఆ తీవ్ర మానసిక ఒత్తిడి, బాధ నుంచి బయటపడటానికి ఇలా విమానాలకు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు ఇచ్చేవాడిని. ఆ బెదిరింపుల వల్ల అక్కడ అత్యవసర పరిస్థితి ఏర్పడి, అధికారులు భయాందోళనకు గురవ్వడం చూస్తుంటే నా మనస్సుకు ఒక రకమైన వికృతమైన తృప్తి కలిగేది" అని శరత్ పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. కేవలం తమిళనాడుకు వచ్చే విమానాలకే తాను 109 సార్లు బాంబు బెదిరింపులు పంపినట్లు నిందితుడు స్పష్టం చేశాడు.
శరత్ చేసిన ఈ వికృత చేష్టల వల్ల విమానాశ్రయాల్లో తీవ్ర కలకలం రేగడమే కాకుండా, భద్రతా తనిఖీల కోసం విమానాలను అత్యవసరంగా నిలిపివేయడం లేదా దారి మళ్లించడం చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఎయిర్పోర్టు యంత్రాంగానికి, వివిధ విమానయాన సంస్థలకు వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసర సేవల వ్యవస్థను పక్కదారి పట్టించి, ప్రభుత్వ యంత్రాంగానికి విపరీతమైన నష్టం కలిగించినందుకు గానూ శరత్ సుబ్రమణ్యన్పై చెన్నై పోలీసులు మరో రెండు తీవ్రమైన కేసులు నమోదు చేశారు. ఈ వికృత చేష్ట వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా లేదా శరత్ ఒక్కడే ఈ నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












