న్యూఢిల్లీ, 2026-06-05
ట్రాపికల్ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావం మానవాళి చరిత్రలోనే అత్యంత తీవ్రంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి ఇది పీక్ స్టేజ్కు చేరుకుని, ప్రపంచ ఉష్ణోగ్రతలను మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రాపికల్ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావం మానవాళి చరిత్రలోనే అత్యంత తీవ్రంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి ఇది పీక్ స్టేజ్కు చేరుకుని, ప్రపంచ ఉష్ణోగ్రతలను మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సూపర్ ఎల్ నినో స్థాయికి చేరుకున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
సముద్ర గర్భంలో దాగి ఉన్న వేడి
శాస్త్రవేత్తలను మరింత భయాందోళనకు గురిచేస్తున్న అంశం ఏమిటంటే, రాబోయే నెలల్లో సముద్ర గర్భంలో దాగి ఉన్న భారీ ఉష్ణ నిల్వలు బయటపడనున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం, పసిఫిక్ సముద్ర అంతర్భాగంలో ఉన్న వేడి, గతంలో తీవ్ర విపత్తులను సృష్టించిన 1982-83, 1997-98, 2015-16 నాటి ఎల్ నినోల తీవ్రతలను కూడా దాటిపోయింది. సముద్రం వేడెక్కుతున్న వేగం, అంచనా వేస్తున్న తీవ్రత, సముద్రంలో దాగి ఉన్న వేడి పరిమాణం.. ఇలా పలు అంశాల్లో ఈసారి అన్ని పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయని ప్రముఖ వాతావరణ విశ్లేషకులైన కొలిన్ మెక్కార్తీ జాతీయ మీడియాకు తెలిపారు.
ప్రపంచ వాతావరణ వ్యవస్థలపై ప్రభావం
మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని అంచనా వేశారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, కరువులు, తుఫానులు, తీవ్రమైన వేడిగాలుల (హీట్వేవ్స్) సరళి మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్ నినో మరింత బలపడి, నవంబర్-డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరనుంది. ఇది నిజమైతే, గతంలో సంభవించిన అతి పెద్ద ఎల్ నినోల రికార్డులన్నీ బద్దలవుతాయి.
2027 నాటికి భయానక పరిస్థితులు
మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులతో ఈ శక్తివంతమైన ఎల్ నినో తోడైతే, 2027 ప్రారంభం నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి ఉష్ణోగ్రతల కంటే దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. ఇది సంభవిస్తే, గత వందల వేల సంవత్సరాలలో భూగ్రహం చూడని విపరీతమైన వేడి వాతావరణంలోకి మనం అడుగుపెట్టినట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. రాబోయే 12 నుండి 18 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ వైపరీత్యాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
తీవ్ర వాతావరణ వైపరీత్యాల హెచ్చరిక
కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువులు, మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. రుతుపవనాల గమనంలో మార్పులు కూడా సంభవించవచ్చు. మొత్తానికి, రాబోయే కొన్ని నెలలు భూమి వాతావరణ వ్యవస్థకు అత్యంత తీవ్రమైన పరీక్షా కాలంగా మారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












