కుబీర్ మండలం చాత గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహన్రావు పటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని, శివాజీ మహారాజ్ స్ఫూర్తితో యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.
చాత గ్రామంలో గ్రామస్థుల ప్రత్యేక ఆహ్వానం మేరకు జరిగిన ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మోహన్రావు పటిల్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలకు, హిందూ సమాజాన్ని ఐక్యపరిచి స్వరాజ్య స్థాపనకు కృషి చేసిన మహానాయకుడని కొనియాడారు.
1630 ఫిబ్రవరి 19న జన్మించిన శివాజీ మహారాజ్ ఆదర్శాలను యువత అందిపుచ్చుకోవాలని, వారిలో దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయడంపై గ్రామస్థులను అభినందించిన మోహన్రావు పటిల్, ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


