రాబోయే రోజుల్లో మిర్యాలగూడను ఒక ప్రధాన పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దే ప్రణాళికలున్నాయని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ట్రైన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మిర్యాలగూడలో విలేకరుల సమావేశంలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ట్రైన్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేస్తుందని హామీ ఇచ్చారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ రైళ్లు, నేషనల్ హైవేలు, డ్రై పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. హైవేలపై ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్లపై విమర్శలు గుప్పించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలోని 12 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.












