జిల్లాలో పనిచేస్తున్న హమాలి కార్మికుల కూలీ రేట్లను పెంచాలని, నెలకు ₹6,000 పెన్షన్ అందించాలని సీఐటీయూ (CITU) డిమాండ్ చేసింది. కడెం మండల కేంద్రంలో హమాలి యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై గురువారం సమావేశం జరిగింది.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా హమాలి కార్మికులకు ఒకే విధమైన కూలీ రేట్లను అమలు చేయాలని కోరారు. కడెం మండల కేంద్రంలో మండు బస్తాల లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికులకు బస్తాకు కనీసం ₹15 కూలీ చెల్లించాలని యాజమాన్యాలను కోరారు.
హమాలి కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, నెలకు ₹6,000 పెన్షన్ వంటి డిమాండ్లకు ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు.
కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో కడెం మండల హమాలి కార్మికుల నూతన కమిటీని కూడా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె. లచ్చన్న, ప్రధాన కార్యదర్శిగా జే. వెంకటేష్ ఎన్నికయ్యారు.


