హైదరాబాద్, 2026-08-11
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అర్హత ప్రమాణాల్లో మార్పుల్లేవు
కొత్త పింఛన్ల కోసం అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎలిజిబిలిటీ క్రైటీరియానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటోంది. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారమే అర్హతను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
గత దరఖాస్తుల పరిగణన
ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసి, అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అయితే, అవసరమైన పత్రాలు సమర్పించని వారు లేదా ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
అవసరమైన ధ్రువపత్రాలు
అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరమని పేర్కొన్నారు.
పింఛన్ల మంజూరు ప్రక్రియ
దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్దేశిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారని, ఆ తర్వాత అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తారని అధికారులు వివరించారు.
స్వయం సహాయక సంఘాల పాత్ర
ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ప్రతి అర్హత కలిగిన వితంతువు, ఒంటరి మహిళకు దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో సహకరించాలని సూచించారు.












