నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడా గ్రామంలో ఉన్న పల్లె దవాఖానలో సరైన వైద్య సేవలు అందడం లేదని, అక్కడ డాక్టర్ను వెంటనే నియమించాలని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (AIPSU) జిల్లా కార్యదర్శి గడిపల పరమేష్ డిమాండ్ చేశారు.
గ్రామంలోని పల్లె దవాఖాన కేవలం పేరుకే పరిమితమైందని, నెలలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తెరిచి, అదీ గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడానికి మాత్రమే వినియోగిస్తున్నారని పరమేష్ విమర్శించారు. దీనివల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, ఆశా వర్కర్లే వైద్య సేవలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని, అత్యవసర సమయంలో వైద్య సహాయం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వందలాది మంది ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు ఉన్నప్పటికీ వారికి సకాలంలో వైద్యం అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పరమేష్ అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి (DMHO) తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.
తరోడా పల్లె దవాఖానలో శాశ్వత ప్రాతిపదికన డాక్టర్ను నియమించి, ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.











