రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లా విద్యార్థులు సాధించిన విజయాలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందనలు తెలిపారు. జిల్లా క్రీడాకారులు మొత్తం 25 పతకాలు సాధించి జిల్లా కీర్తిని పెంచారని ఆమె పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి, జిల్లాకు 4 బంగారు, 8 వెండి, 13 కాంస్య పతకాలు సహా మొత్తం 25 పతకాలను సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించడం గర్వకారణమని అభివర్ణించారు. విద్యార్థుల విజయాలు జిల్లా క్రీడాకారుల అద్భుత ప్రతిభకు నిదర్శనమని ఆమె తెలిపారు.
ఈ విజయానికి సహకరించిన యువజన క్రీడల శాఖ అధికారులు, కోచ్లు, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
అనంతరం, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఈవో భోజన్న, సిపిఓ జీవరత్నం, కోచ్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


