జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ '99 రోజుల ప్రత్యేక ప్రణాళిక' అమలును పర్యవేక్షించే క్రమంలో గురువారం ఉదయం స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, మెస్ నాణ్యత, విద్యా బోధనపై ఆరా తీశారు.
కలెక్టర్ పాఠశాలకు చేరుకుని, విద్యార్థులతో కలిసి ఉదయపు అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెస్ నిర్వహణను పరిశీలించి, అల్పాహారం నాణ్యతను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, స్టాక్ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషించిన కలెక్టర్, వారికి అందుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఉపాధ్యాయులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందాలని ఆదేశించారు.
అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


