చిత్తూరు, 2026-06-05
చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి దివ్య వివాహం జరిగిన పవిత్ర కల్యాణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తిరుమలలో జగద్రక్షకుడిగా దర్శనమిచ్చే శ్రీవారు, ఇక్కడ కల్యాణమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈ పుణ్యక్షేత్రం వివాహ అవరోధాలను తొలగించి, దాంపత్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం కేవలం ఒక వైష్ణవ క్షేత్రం మాత్రమే కాదు, శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి దివ్య వివాహం జరిగిన పవిత్ర కల్యాణ క్షేత్రంగా భక్తులు విశ్వసించే అత్యంత ప్రాచీన పుణ్యస్థలం. తిరుమలలో శ్రీనివాసుడు జగద్రక్షకుడిగా దర్శనమిస్తే, నారాయణవనంలో కల్యాణమూర్తిగా, నూతన వరుడి రూపంలో భక్తులను అనుగ్రహించడం ఈ క్షేత్రపు ప్రధాన విశిష్టత.
నారాయణవనం పేరు వెనుక కథ
పురాణకాలంలో ఈ ప్రాంతం తుండీర మండలం పరిధిలో ఉండేదని స్థలపురాణం తెలియజేస్తోంది. ఆకాశరాజు నారాయణవనాన్ని తన రాజధానిగా చేసుకొని పరిపాలించేవారని, శ్రీమహావిష్ణువు నారాయణుడి రూపంలో ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడే పద్మావతి దేవిని వివాహం చేసుకున్న కారణంగా ఈ ప్రాంతానికి నారాయణవనం అనే పేరు స్థిరపడిందని భక్తుల విశ్వాసం.
పద్మావతి అమ్మవారి ఆవిర్భావం
ఆకాశరాజు దంపతులకు చాలాకాలం సంతానం కలగకపోవడంతో, పుత్రకామేష్టి యాగం నిర్వహించాలని సంకల్పించారు. యాగశాల నిర్మాణానికి భూమిని నాగలితో దున్నుతుండగా, పద్మంలో పవళించి ఉన్న ఒక దివ్య బాలిక కనిపించిందని స్థలపురాణం చెబుతోంది. పద్మంలో లభించిన బాలిక కావడంతో ఆమెకు పద్మావతి అని నామకరణం చేశారు. ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు ఆమెను తమ కన్నబిడ్డగా ఎంతో ప్రేమతో పెంచారు. పద్మావతి దేవి స్వయంగా మహాలక్ష్మి అవతారమని భక్తుల విశ్వాసం.
శ్రీనివాసుడుపద్మావతి దేవి తొలి పరిచయం
ఒకరోజు తిరుమలలో నివసిస్తున్న శ్రీనివాసుడు వేటకు బయలుదేరి, ఒక అడవి ఏనుగును వెంబడిస్తూ నారాయణవనం ప్రాంతానికి వచ్చారు. అక్కడి రాజ ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరిస్తున్న పద్మావతి దేవిని చూసి, ఆమెను వివాహం చేసుకోవాలని సంకల్పించారు. తరువాత వకుళమాత ద్వారా ఆకాశరాజు దంపతులకు వివాహ ప్రతిపాదన పంపించారని పురాణకథనం. జ్యోతిషులు, పురోహితులు ఈ సంబంధం దైవనిర్ణయమని తెలియజేయడంతో ఆకాశరాజు దంపతులు సంతోషంగా అంగీకరించారు.
దివ్య కల్యాణ మహోత్సవం
విళంబి నామ సంవత్సరంలో, వైశాఖ మాసం, శుక్లపక్ష దశమి, శుక్రవారం నాడు శ్రీనివాసుడుపద్మావతి దేవి వివాహం అత్యంత వైభవంగా జరిగినట్లు స్థలపురాణం పేర్కొంటోంది. బ్రహ్మ, రుద్రుడు, ఇతర దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ఈ దివ్య కల్యాణానికి హాజరయ్యారని పురాణకథనం. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీ దేవిని శ్రీనివాసుడికి సాలంకృత కన్యాదానం చేశారు. వేదమంత్రాల మధ్య పాణిగ్రహణం జరగడంతో నారాయణవనం భూలోకంలోని పవిత్ర కల్యాణ వేదికగా ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి అని పిలుస్తారు.











