మదనపల్లె, 2026-07-15
సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్' (Money Restoration Module)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా బాధితులు తమ నిధులను సులభంగా తిరిగి పొందే అవకాశం ఉందని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు. అర్హులైన బాధితుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కానున్నాయి.
సైబర్ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శుభవార్త అందించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు తమ నిధులను సులభంగా తిరిగి పొందేలా సరికొత్త 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్' (Money Restoration Module) విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బ్యూరో డైరెక్టర్, ఐపీఎస్ అధికారిణీ శిఖా గోయెల్ తెలిపారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) నుంచి రీఫండ్ కు సంబంధించిన ఎస్ఎంఎస్ (SMS), నోటిఫికేషన్ అందుకున్న బాధితులు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ MRM మాడ్యూల్ ద్వారా తమ అభ్యర్థనను సమర్పించవచ్చని ఆమె స్పష్టం చేశారు. చట్ట సంస్థలతో పాటు బ్యాంకులు సంయుక్తంగా సర్టిఫై చేసిన తర్వాత అర్హులైన బాధితుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కానున్నాయి.
సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా బాధితులు ఆరు పద్ధతుల్లో సులభంగా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా సైబర్ క్రైమ్ ఫిర్యాదుకు లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా పోర్టల్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా గుర్తింపును ధృవీకరించాలి. అర్హత కలిగిన ఫిర్యాదును, కేటాయించిన బ్యాంక్ ఖాతాను సెలెక్ట్ చేసుకోవాలి.
వెంటనే అవసరమైన చోట పాన్ (PAN) కార్డ్ వివరాలను అప్లోడ్ చేయాలి. చివరగా రీఫండ్కు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకుని పోర్టల్ ద్వారా రీఫండ్ అభ్యర్ధనను సబ్మిట్ చేయాలి. సమర్పించిన అభ్యర్ధన విజయవంతమైనట్లుగా మెసేజ్ వచ్చిన తర్వాత నేరుగా బాధితుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయనున్నారు.












