మిర్యాలగూడ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలకు మొదటి రోజు పలువురు న్యాయవాదులు అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది గౌరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పదవికి జంగిలి ఎల్లయ్య, కోశాధికారి పదవికి రెడ్డిపల్లి సైదులు, క్రిడల కార్యదర్శి పదవికి భూక్యా రమేష్, గ్రంధాలయ కార్యదర్శి పదవికి రాయరపు భాస్కర్ నామినేషన్లు దాఖలు చేశారు. కార్యవర్గ సభ్యుల పదవులకు పెండ్యాల నర్సింహారావు, సకినాల వేలాద్రి, బంటు మహేష్ లు నామినేషన్లు సమర్పించారు.
నామినేషన్ల దాఖలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. అనంతరం, 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరుగుతాయి. ఈ ప్రక్రియల అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు.
ఈ నెల 14న జరగనున్న ఎన్నికలలో సుమారు 167 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని అధికారులు పేర్కొన్నారు.












