** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
దేశంలో అత్యున్నత స్థాయి సంపన్నుల సంపద గణనీయంగా పెరుగుతోందని, గడిచిన ఐదేండ్లలో శత కోటీశ్వరుల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. 2025-26 ఐటీ రిటర్న్స్ ప్రకారం రూ. 100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య 576కి చేరింది.
దేశంలో నిత్యావసరాలు, అధిక ధరలతో సామాన్యుల సగటు ఆదాయం తగ్గుముఖం పడుతుంటే, అత్యున్నత స్థాయి సంపన్నుల సంపద మాత్రం గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. గడిచిన ఐదేండ్లలో శత కోటీశ్వరుల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని ఆయన లోక్సభకు వెల్లడించారు.
2025-26 ఐటీ రిటర్న్స్ అసెస్మెంట్ ఇయర్లో రూ. 100 కోట్లకు పైగా స్థూల వార్షిక ఆదాయాన్ని ప్రకటించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో 576కి చేరింది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 415గా ఉండగా, ఒక్క ఏడాదిలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే ఈ వర్గం దాదాపు 39 శాతం మేర పెరగడం గమనార్హం.
ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం బిలియనీర్ అనే పదానికి నిర్దిష్ట చట్టపరమైన నిర్వచనం లేనప్పటికీ, గత ఐదేండ్ల ఐటీఆర్ గణాంకాలను పరిశీలిస్తే ఈ అధిక ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఏకంగా 300 శాతానికి పైగా పెరిగింది. 2021-22లో కేవలం 142 మందిగా ఉన్న ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుత స్థాయికి చేరుకుంది. 2022-23 నాటికి ఆ సంఖ్య 301కి చేరగా, 2023-24లో 284కి తగ్గి, 2024-25 నాటికి 415కి చేరింది.
మరోవైపు, దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. తాజా గృహ వినియోగ వ్యయ సర్వే (2023-24) ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినియోగ వ్యయం అంతరం తగ్గిందని ఆర్థిక శాఖ పేర్కొంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ఆధారంగా 2025 నాటికి నిరుద్యోగ రేటు 3.1 శాతానికి పడిపోయిందని కూడా తెలిపింది.












