ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్, నిర్మల్ సర్కిల్లో పర్యటించి, వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, కడెం, ఖానాపూర్ సెక్షన్ల పరిధిలోని లింగాపూర్, మాస్కాపూర్ గ్రామాల్లో వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పరిశీలించారు. వర్షాకాలంలో చెట్ల కొమ్మలు పడటం వల్ల ఏర్పడే అంతరాయాలను నివారించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
33/11 కేవీ కడెం విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించి, పనితీరు, నిర్వహణ, వినియోగదారుల సేవలను సమీక్షించారు. కడెం, పెంబి అటవీ ప్రాంతాల గుండా వెళ్లే లైన్లపై కవర్డ్ కండక్టర్లను ఏర్పాటు చేయాలని, దీనివల్ల విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.
కడెం, పెంబి, దస్తూరాబాద్ ప్రాంతాల్లోని సబ్స్టేషన్లకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తాళ్లపేటలో కొత్త 132 కేవీ సబ్స్టేషన్, నిర్మల్-ఖానాపూర్ 132 కేవీ లైన్ డబుల్ సర్క్యూట్గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరా విశ్వసనీయత పెరుగుతుంది.
ఓ అండ్ ఎం సిబ్బందితో భద్రతా ప్రమాణాలపై చర్చించిన సీఎండీ, నిర్వహణ పనుల్లో భద్రతా నిబంధనలు, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం తప్పనిసరి అని ఆదేశించారు. ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.












