రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు వరి కళ్లాలకు నిప్పంటించడంతో మంటలు సమీప పొలాలకు వ్యాపించాయి.
విలాసాగర్ గ్రామ ఎస్సీ కాలనీ సమీపంలో, జెగ్గరావుపల్లి వెళ్లే రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందిన వెంటనే గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి, ఫైర్ ఇంజన్ను రప్పించేలా చర్యలు చేపట్టారు.
ఫైర్ సిబ్బంది చేరుకోవడానికి ముందే, గ్రామ యువకులు మరియు రైతులు కలిసి మంటలను ఆర్పేందుకు స్వయంగా ప్రయత్నించారు. వారి సమష్టి కృషితో, సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ, వ్యవసాయ భూముల్లో వరి కళ్లాలను నిర్లక్ష్యంగా కాల్చడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అందరూ అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












