లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, ఆ వెంటనే కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా భేటీ కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వానికి తొలిసారిగా ఇలాంటి భంగపాటు ఎదురైంది. ఒక కీలక బిల్లుకు విపక్షాలు బ్రేక్ వేయడంతో, ప్రధాని తన ప్రసంగంలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే దానిపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై విపక్షాల అడ్డంకులను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఏదైనా సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిల్లు వీగిపోవడంపై ప్రజలకు నేరుగా వివరణ ఇవ్వడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
ఎన్డీయే ప్రభుత్వానికి ఇదొక పరీక్షా సమయంగా భావిస్తున్న తరుణంలో, ప్రధాని మోదీ తన ప్రసంగం ద్వారా విపక్షాలకు చెక్ పెట్టేలా బలమైన నిర్ణయం తీసుకుంటారా? లేక ముందస్తు ఎన్నికల వంటి నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? అన్న కోణంలో రాజకీయ పార్టీలు తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నాయి.











