మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి నేతిబొట్టు తరుణ్, ఓ మహిళా లెక్చరర్ తనను అవమానించినట్లు ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాలో రెండో స్థానం సాధించినా, తోటి విద్యార్థితో పోల్చి కించపరచడంతో తరుణ్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది.
గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్(17) అనే విద్యార్థి, ఓ మహిళా లెక్చరర్ అవమానించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి, ఉరివేసుకుని తరుణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 434 మార్కులతో జిల్లాలో రెండో స్థానం సాధించిన తరుణ్ను, కాలేజీలో 435 మార్కులు వచ్చిన మరో విద్యార్థితో పోల్చుతూ ఆ మహిళా లెక్చరర్ కించపరిచినట్లు సమాచారం. ఈ ప్రవర్తన సరికాదని తరుణ్ ఆమెను విజ్ఞప్తి చేసినప్పటికీ, 'నువ్వేమన్నా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా' అంటూ తరుణ్ చెంపపై కొట్టి అవమానించినట్లు తెలిసింది. లెక్చరర్ ప్రవర్తనకు క్లాస్లోని విద్యార్థులంతా నవ్వడంతో తరుణ్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు.
తరుణ్ రాసిన సూసైడ్ నోట్ ప్రకారం, 'ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ అవమానించకూడదు. ఒక్క సున్నిత మనస్కుడికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆమెకు తెలియాలి' అని పేర్కొన్నాడు. తనపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయం ప్రజలందరికీ తెలియాలనే ఇలా చేస్తున్నానని సూసైడ్ నోట్లో తెలిపాడు.

