హైదరాబాద్, జులై 23
తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
గురువారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో డీజీపీ కార్యాలయంలోని వాష్రూమ్కు వెళ్లిన కానిస్టేబుల్ స్వామి, తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
కాల్పుల శబ్దం విన్న సహచర పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో పోలీసులు నిర్వహించిన పరిశీలనలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది.
ఆ నోట్లో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పు పట్టవద్దని, వారు చాలా మంచివారని స్వామి పేర్కొన్నారు. అంతేకాకుండా, 'నేను చనిపోయి దయ్యం అయినా కూడా నా భార్య, పిల్లలను చూసుకుంటాను' అంటూ భావోద్వేగపూరితంగా రాశారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.












