నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి-బి గ్రామానికి చెందిన గడ్డెం యశోద నర్సింగ్ ఉద్యోగానికి, ఆమె సోదరుడు గడ్డెం గజానంద్ భారత సైన్యంలో అగ్నివీర్గా ఒకేసారి ఎంపికయ్యారు. ఈ వార్త గ్రామంలో సంతోషాన్ని నింపింది.
గడ్డెం గణేష్ కుమార్తె యశోద నర్సింగ్ ఉద్యోగానికి ఎంపిక కాగా, కుమారుడు గజానంద్ అగ్నివీర్గా ఎంపికయ్యారని అధికారులు తెలిపారు. ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన ఈ యువతీ యువకుల విజయాన్ని గ్రామస్తులు ఘనంగా అభినందించారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కా తమ్ముడిని శాలువాలు కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ, యశోద, గజానంద్లు గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచారని, వారి విజయంతో గ్రామానికి మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. ఈ విజయం గ్రామంలోని ఇతర యువతకు కూడా స్ఫూర్తినిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.











