నేరాల నియంత్రణ మరియు ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించే లక్ష్యంతో ముధోల్ లోని కొలి గల్లీలో శుక్రవారం ఉదయం ముధోల్ సీఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం, కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను సీజ్ చేయడంతో పాటు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో, సీఐ రవీందర్ నాయక్ ప్రజలకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
తనిఖీల్లో భాగంగా, సరైన ధ్రువీకరణ పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 100 మోటార్ సైకిళ్లు, 3 త్రీ-వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్.సి, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనియెడల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మైనర్లకు వాహనాలు అప్పగించిన యజమానులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సైలు, సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


